గీతా కంద మరందం -2 (సంపూర్ణం)
➖➖➖➖➖➖➖➖
గీతా (కంద) మరందం
➖➖➖➖➖➖➖➖
➖➖➖➖➖➖➖➖
2.సాంఖ్య యోగం
➖➖➖➖➖➖➖➖
శ్లోకం 1
సంజయ ఉవాచ:-
తం తథా కృపయా 22విష్టమ్
అశ్రుపూర్ణాకులేక్షణమ్
విషీదన్త మిదం వాక్యమ్
ఉవాచ మధుసూదనః ||
సంజయ ఉవాచ:-
సంజయుడు చెప్పెను
టీక:-
తథా=అట్లు;
కృపయా=కనికరముచేత
ఆవిష్టమ్=కూడుకొనియున్న వాడును
అశ్రుపూర్ణాకులేక్షణమ్=కన్నీటితో నిండిన వ్యాకులమైన నేత్రములు గలవాడును
విషీదన్తమ్= దుఃఖించుచున్నవాడును అగు
తం =ఆ అర్జునుని గూర్చి
మధుసూదనః=శ్రీకృష్ణమూర్తి
ఇదం వాక్యం=ఈ (చెప్పబోవు) వాక్యమును
ఉవాచ=పలికెను.
తాత్పర్యం:-
సంజయుడు చెప్పెను.
ఆ ప్రకారంగా కనికరముతో కూడుకొని,కంటనీరు పెట్టుకొంటూ,కలవరపాటుతో దుఃఖిస్తున్న ఆ అర్జునుని చూసి శ్రీకృష్ణుడు ఇలా పలికినాడు.
నా అనువాద పద్యం:-
కం.
ఈ రీతిని కలవరమున
జారెడు కన్నీటి కనుల జాలిని గొనుచున్
తేరున దుఃఖించు నరుని
తీరుని గని మాధవుండు తెలియగ బలికెన్. (2-1)
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
శ్లోకం - 2
శ్రీ భగవానువాచ:-
కుతస్త్వా కశ్మలమిదం
విషమే సముపస్థితమ్ |
అనార్యజుష్ట మస్వర్గ్యం
అకీర్తికర మర్జున || (2-2)
టీక:-
అర్జున= ఓ అర్జునా
అనార్యజుష్టం= పామరులచే నవలంబింపబడదగినదియు
అస్వర్గ్యం =స్వర్గప్రాప్తికి భంగకరమైనదియు
అకీర్తికరం =అపకీర్తిని కలిగించునదియు అగు
ఇదం= ఈ
కశ్మలం =మనోవ్యాకులత్వము (మోహము)
విషమే= ఈ విషమసమయమందు
త్వా= నిన్ను
కుతః =ఎక్కడినుండి ( లేక ఏ కారణము చేత)
సముపస్థితం =పొందినది?
తాత్పర్యం:-
శ్రీ భగవానుడు చెప్పెను
ఓ అర్జునా!పామరులు అవలంబించునదియు,స్వర్గ ప్రతిబంధకమును, అపకీర్తిని కలిగించునదియు అగు ఈ మోహము ఈ విషమ సమయమందు నీకెక్కడినుండి దాపురించినది?
అనువాద పద్యం :-
కం.
ఎక్కడిదీ మోహమిటుల ?
చిక్కితివో పార్థ ! రిపుల చెండెడు వేళన్
దక్కదు స్వర్గము కీర్తియు
ప్రక్కకు మరలుట తగదిది పామరు పగిదిన్.(2-2)
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
శ్లోకం 3
క్లైబ్యం మాస్మగమః పార్థ
నైతత్త్వయ్యుపపద్యతే|
క్షుద్రం హృదయ దౌర్బల్యం
త్యక్త్వోత్తిష్ఠ పరన్తప||
టీక :-
పార్థ =ఓ అర్జునా
క్లైబ్యం= అధైర్యమును
మాస్మగమః= పొందకుము
ఏతత్= ఇది
త్వయి= నీయందు
న ఉపపద్యతే= తగదు
పరన్తపః =శత్రువులను తపింపజేయు ఓ అర్జునా !
క్షుద్రం= నీచమైన
హృదయ దౌర్బల్యం= మనోదుర్బలత్వమును
త్యక్త్వా= విడిచి
ఉత్తిష్ఠ= (యుద్ధమునకు) లెమ్ము
తాత్పర్యం:-
ఓ అర్జునా! అధైర్యమును పొందకుము.ఇది నీకు తగదు.నీచమగు ఈ మనోదుర్బలత్వమును వీడి యుద్ధము చేయుటకు లెమ్ము.
అనువాద పద్యం:-
కం.
పొందకు మధైర్య మది నీ
కందువకున్ తగదు పార్థ!కడు హేయమగున్
కొందలమును విడి లెమ్మా!
యందగ విజయమ్ము పట్టు మాయుధ మింకన్. (2-3)
కందువ.. సామర్థ్యం
కొందలము.. క్షోభ
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
శ్లోకం 4.
అర్జున ఉవాచ
కథం భీష్మమహం సంఖ్యే
ద్రోణం చ మధుసూదన |
ఇషుభిః ప్రతియోత్స్యామి
పూజార్హావరిసూదన || (2-4)
ప్రతిపదార్థం :-
అర్జున ఉవాచ =అర్జునుడు అడిగెను
అరిసూదన= శత్రువులను నశింపజేయునట్టి
మధుసూదన= ఓ శ్రీకృష్ణా!
పూజార్హౌ= పూజింపదగినట్టి
భీష్మం =భీష్ముని
ద్రోణం చ =ద్రోణుని
సంఖ్యే= యుద్ధమునందు
అహం= నేను
ఇషుభిః =బాణములతో
కథం =ఎట్లు
ప్రతియోత్స్యామి= ఎదిరించి యుద్ధం చేయగలను?
తాత్పర్యం :-
అర్జునుడు అడిగెను -ఓ కృష్ణా! భీష్మ ద్రోణులిరువురును పూజింపదగినవారు.అట్టివారిపై బాణములను వదలి నేనెట్లు యుద్ధము చేయగలను?
అనువాద పద్యం ;-
కం.
మధుసూదన! గాంగేయుని
విధిగా పూజింపదగిన విద్యాగురులన్
వ్యధ చెందక బాణమ్ముల
వధియింపగ నోపుటెట్లు?బంధుల హితులన్. (2-4)
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
శ్లోకం 5
గురూనహత్వా హి మహానుభావాన్
శ్రేయో భోక్తుం భైక్ష్యమహీహ లోకే
హత్వార్థకామాంస్తు గురూనిహైవ
భుంజీయ భోగాన్ రుధిరప్రదిగ్ధాన్
ప్రతిపదార్థం:-
మహానుభావాన్= మహానుభావులైన
గురూన్= గురువులను
అహత్వా =చంపక
ఇహలోకే =ఈ లోకమునందు
భైక్ష్యమపి= భిక్షాన్నమైనను
భోక్తుం= భుజించుటకు
శ్రేయోహి= మంచిది కదా
గురూన్ =గురువులను
హత్వాతు= చంపియో
ఇహైవ= ఈ లోకముననే
రుధిరప్రదిగ్ధాన్= రక్తముచే పూయబడిన
అర్థకామాన్ =సంపదలు,కామ్య వస్తువుల రూపమగు
భోగాన్ =భోగములను
భుంజీయ= భుజించువాడ నగుదును .
తాత్పర్యం:-
మహానుభావులైన గురువులను చంపక,ఈ లోకమునందు భిక్షాన్నమైనను భుజించుట మంచిది.వారిని చంపినచో అత్తఱి వారి రక్తముతో తడిసిన ధనసంపదలనే అనుభవింపవలసియుండును.
అనువాద పద్యం :-
కం.
మహనీయుల గురుల దునిమి
యిహలోకమునందు భోగ మియ్యకొనుచు నా
నిహతుల నెత్తుటి కూటిని
సహియింపను బిచ్చమెత్త సైతును కృష్ణా!
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
శ్లోకం - 6
న చైతద్విద్మః కతరన్నో గరీయో
యద్వా జయేమ యది వా నో జయేయుః
యానేవ హత్వా న జిజీవిషామః
తే 2వస్థితాః ప్రముఖే ధార్తరాష్ట్రాః (2-6)
ప్రతిపదార్థం :-
నః= మనకు
కతరత్ =ఏది
గరీయః= శ్రేష్టమో
ఏతత్ చ= దీనిని కూడా
న విద్మః =ఎఱుగము
జయేమ యద్వా= (మనము) జయించెదమో ( లేక)
నః =మనలను
జయేయుః యదివా= (వారే) జయించెదరో
యాన్ =ఎవరిని
హత్వా =చంపి
న జిజీవిషామః = జీవింపగోరెదమో
తే ధార్తరాష్ట్రాః ఏవ =అట్టి ధృతరాష్ట్రుని సంబంధులగు భీష్మాదులే
ప్రముఖే =ఎదుట
అవస్థితాః =నిలిచియున్నారు
తాత్పర్యం :-
పైగా ఈ యుద్ధమున మనము గెల్తుమో లేక వారే గెలుతురో చెప్పలేము.ఈ రెండింటిలో మనకేది శ్రేష్టమో కూడా తెలియదు.ఎవరిని చంపి మనము జీవించగోరెదమో అట్టి భీష్మాదులు యుద్ధమున మన ఎదుట నిలిచియున్నారు.
అనువాద పద్యం :-
కం.6
ఎఱుగము జయాపజయముల
నెఱుగము మనకేది విహిత మీ తరుణములోఁ
నుఱుకుచు నని సేయుటెటుల?
యెఱిగిన సంబంధులాయె నెదిరి బలమునన్.
బలము..సైన్యము
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
శ్లోకం - 7
కార్పణ్యదోషోపహతస్వభావః
పృచ్ఛామి త్వాం ధర్మసమ్మూఢచేతాః
యచ్ఛ్రేయస్స్యాన్నిశ్చితం బ్రూహి తన్మే
శిష్యస్తే2హం శాధి మాం త్వాం ప్రపన్నమ్
ప్రతిపదార్థం :-
కార్పణ్యదోషోపహతస్వభావః= కృపణత్వమను దోషముచే కొట్టబడిన స్వభావము గల (నేను )
ధర్మసమ్మూఢచేతాః= ధర్మవిషయమున సందేహముగల మనస్సుగలవాడనై
త్వాం =నిన్ను
పృచ్ఛామి =అడుగుచున్నాను
యత్= ఏది
నిశ్చితం =నిశ్చయింపబడిన
శ్రేయః =శ్రేయము
స్యాత్ =అగునో
తత్ =దానిని
మే= నాకు
బ్రూహి =చెప్పుము
అహమ్ =నేను
తే =నీకు
శిష్యః =శిష్యుడను.
త్వాం =నిన్ను
ప్రపన్నమ్= శరణుబొందిన
మాం =నన్ను
శాధి =శాసింపుమ.
తాత్పర్యం :-
(ఓ కృష్ణా!)కృపణత్వము అను దోషముచే కొట్టబడిన వాడనగుటచే ధర్మవిషయమున సందేహము గలిగి మిమ్మడుగుచున్నాను.ఏది నిశ్చయముగ శ్రేయస్కరమో దానిని చెప్పుము.నేను మీకు శిష్యుడను.శరణుపొందిన నన్ను (ఈ ప్రకారముగా నడువుము) అని శాసింపుము.
అనువాద పద్యం :-
కం.-7
ఎయ్యది నాకగు శ్రేయ
మ్మయ్యది నే నెఱుగకునికి యడుగుచునుంటిన్
చయ్యన చేకొని శిష్యుగ
నెయ్యమునను యానతిమ్ము నెగులు తొలగగాన్.
నెగులు..బాధ, దుఃఖ రూపమైన విచారము
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
శ్లోకం -8
న హి ప్రపశ్యామి మమాపనుద్యాత్
యచ్ఛోక ముచ్ఛోషణ మిన్ద్రియాణామ్
అవాప్య భూమావసపత్న మృద్ధం
రాజ్యం సురాణామపి చాధిపత్యమ్
ప్రతిపదార్ధం :-
భూమౌ =భూమండలమునందు
అసపత్నం= శత్రువులు లేనట్టిదియు
ఋద్ధమ్ =సమృద్ధమైనట్టిదియు అగు
రాజ్యమ్ =రాజ్యమును (మఱియు)
సురాణామ్= దేవతల యొక్క
ఆధిపత్యం చ =ఆధిపత్యమున్ను
అవాప్య అపి =పొందియు కూడా
ఇంద్రియాణామ్ =ఇంద్రియములకు
ఉచ్ఛోషణమ్= మిక్కిలి తాపమును కలుగజేయునట్టి
మమ= నా యొక్క
శోకం= దుఃఖమును
యత్ =ఏది
అపనుద్యాత్= పోగొట్టునో
(తత్ =దానిని )
నప్రపశ్యామి హి= కనుగొనజాలకున్నాను గదా!
తాత్పర్యం:-
ఈ భూమండలమున శత్రువులు లేని సమృద్ధమైన రాజ్యమును,(స్వర్గమున) దేవతలపై ఆధిపత్యమును పొందియు కూడా, ఇంద్రియములను శోషింపజేయుచున్న ఈ నా దుఃఖమును ఏది పోగొట్టగలదో దానిని కనుగొనజాలకున్నాను.
అనువాద పద్యం :-
కం.8
దాయరహిత రాజ్యసుఖము
దేయపు సురలోక పదవి దీనశరణ్యా!
హాయినొసగ లేవనునటు
పాయని నా దుఃఖమునకు వారణ మెఱుగన్
*దేయము ..ఇయ్యదగినది
*వారణము..అడ్డుకట్ట
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
శ్లోకం - 9
సంజయ ఉవాచ:-
ఏవముక్త్వా హృషీకేశం
గుడాకేశః పరన్తపః
న యోత్స్య ఇతి గోవిందమ్
ఉక్త్వా తూష్ణీం బభూవ హ
ప్రతిపదార్థం :-
సంజయ ఉవాచ =సంజయుడు చెప్పెను
పరన్తపః= శత్రువులను తపింపజేయునట్టి
గుడాకేశః =అర్జునుడు
హృషీకేశమ్= శ్రీకృష్ణునితో
ఏవం= ఈ ప్రకారముగా
ఉక్త్వా =చెప్పి
నయోత్స్యే= యుద్ధము చేయను
ఇతి =అని
గోవిన్దమ్= ఆ కృష్ణపరమాత్మ తో
ఉక్త్వా =పలికి
తూష్ణీం బభూవ హ =ఊరకుండెను
తాత్పర్యం:-
సంజయుడు చెప్పెను.ఈ విధముగా అర్జునుడు శ్రీకృష్ణునితో చెప్పి నేను యుద్ధము చేయను అని ఊరకుండెను.
అనువాద పద్యం :-
కం.9
ఈవిధి యా పార్థుడపుడు
గోవిందుని తోడ పలికి కుమిలెడు మదితో
దేవా!ఆలము సేయను
నావల గాదంచు నిలిచె నైరాశ్యమునన్
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
శ్లోకం 10.
తమువాచ హృషీకేశః
ప్రహసన్నివ భారత
సేనయోరుభయోర్మధ్యే
విషీదన్తమిదం వచః
ప్రతిపదార్థం ;-
భారత= ఓ ధృతరాష్ట్ర మహారాజా
ఉభయోః సేనయోః =రెండు సేనల యొక్క
మధ్యే =నడుమ
విషీదన్తమ్= దుఃఖించుచున్న
తం =ఆ అర్జునుని గూర్చి
హృషీకేశమ్ =శ్రీకృష్ణుడు
ప్రహసన్నివ= నవ్వుచున్నవానివలె
ఇదం వచః =ఈ (చెప్పబోవు) వాక్యమును
ఉవాచ= పలికెను .
తాత్పర్యం :-
ఓ ధృతరాష్ట్ర మహారాజా! రెండు సేనల మధ్య విలపించుచున్న ఆ అర్జునుని జూచి శ్రీకృష్ణుడు నవ్వుచున్నవానివలె ఈ క్రింది వాక్యములను పలికెను.
అనువాద పద్యం :-
కం.10.
పరిపరి ఈరీతి పలికి
మరిమరి దుఃఖించు నరుని మాధవదేవుం
డరవాయిని మాన్పదలచి
చిరునవ్వున నాంబికేయ! చెప్పమొదలిడెన్.
*అరవాయి...సంకోచం,అధైర్యం
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
శ్లోకం 11
శ్రీ భగవానువాచ:-
అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే|
గతాసూనగతాసూంశ్చ నానుశోచన్తి పణ్డితాః||2-11||
ప్రతిపదార్థం :-
శ్రీ భగవానువాచ=భగవానుడు చెప్పెను
త్వమ్ =నీవు;అశోచ్యాన్= శోకింపదగని వారిని గూర్చి ;అన్వశోచః =శోకించితివి;ప్రజ్ఞావాదామ్ చ= బుద్ధివాదముతో గూడిన మాటలను గూడ ;భాషసే =పలుకు చున్నావు ;పండితాః =ఆత్మ జ్ఞానము కలవారు;గతాసూన్ =మరణించిన వారి గురించియు ;
;అగతాసూన్ =బ్రతికి ఉన్న వారిని గురించియు;
;న అనుశోచంతి = దుఃఖింపరు.
తాత్పర్యం :-
(అర్జునా!) నీవు శోకింప దగనివారిని గూర్చి శోకించితివి. పైగా బుద్ధి వాదముతో గూడిన వాక్యములను గూడ పలుకు చున్నావు. జ్ఞానులగువారు మరణించినవారిని గురించి గానీ జీవించియున్న వారిని గురించి గానీ యెన్నటికినీ దుఃఖింపరు.
అనువాద పద్యం :-
కందం-11
శోకించెదు ప్రజ్ఞ లిటుల
శోకింపగ దగనివారి జూచి పలుకుచున్
లోకమునన్ ప్రాజ్ఞులెపుడు
శోకింపరు జననమరణ సొరిదిని గనుచున్ (2-11)
సొరిది...వరుస,క్రమము
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
శ్లోకం - 12
న త్వేవాహం జాతు నాసం
న త్వం నేమే జనాధిపాః
న చైవ న భవిష్యామః
సర్వే వయమతః పరమ్
ప్రతిపదార్థం :-
అహమ్ =నేను
జాతు =ఒకప్పుడును
నాసం (ఇతి)= లేననునది
నతుఏవ= లేనేలేదు
త్వమ్= నీవు
(న ఆసీః ఇతి) న= లేవనునది లేదు
ఇమే =ఈ
జనాధిపాః =రాజులు
(న ఆసన్ ఇతి) న= లేరనునది లేదు
అతః పరమ్ =ఇకమీదట
వయంసర్వే= మనముమందఱమును
న భవిష్యామః ( ఇతి) చ= లేకపోవుదు మనునదియు
న ఏవ =లేదు
తాత్పర్యం :-
అర్జునా!నేను గానీ,నీవు గానీ,ఈ రాజులు గానీ ఒకప్పుడును లేనివారముకాదు.ముందున్ను లేకపోవువారము కాము.
అనువాద పద్యం :-
కం.12.
నీవును నేనును పార్థా!
రావడి గనలేని శత్రురాజ నివహముల్
చావునెఱుంగము పూర్వము
భావిని లేకుండపోము భద్రాత్ములమై
*రావడి..ఉపద్రవం,ఆపద, ముప్పు
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
సాంఖ్య యోగం
శ్లో|| 13
దేహినోऽస్మిన్ యథా దేహే
కౌమారం యౌవనం జరా|
తథా దేహాన్తరప్రాప్తిః
ధీర స్తత్ర న ముహ్యతి ||2-13||
ప్రతిపదార్థం:-
దేహినః = జీవునకు;అస్మిన్ దేహే= ఈ శరీరమునందు;కౌమారమ్= బాల్యము;యౌవనమ్= యౌవనము ;జరా = వార్ధక్యము ;యథా =ఎట్లో ;తథా =అట్లే ;దేహాన్తర ప్రాప్తిః= మరియొక దేహమును పొందుటయు (కలుగుచున్నది);తత్ర =ఈ విషయమున ;ధీరః =జ్ఞాని ;న ముహ్యతి = మోహమునొందడు .
తాత్పర్యం:-
జీవునకు ఈ దేహమునందు బాల్యము, యౌవనము, ముసలితనము అను అవస్థలు ఎట్లు కలుగుచున్నవో మరొక దేహమును పొందుటకు కూడ అట్లే తటస్థించుచున్నది. కనుక ఈ విషయమున ధీరులు ఎంతమాత్రమును మోహము నొందరు.
అనువాద పద్యం :-
కం.13
వాహిత బాల్యము ప్రాయము
దేహి యనుభవించి జరయు దేహము విడువన్
దేహాంతరమిక కలుగును
మోహములో దీనికొరకు మునుగరు ధీరుల్ (2-13)
వాహితం...వహింపబడినది
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
శ్లోకం - 20
న జాయతే మ్రియతే వా కదాచిత్
నాయం భూత్వా భవితా వా న భూయః
అజో నిత్యశ్శాశ్వతో2యం పురాణో
న హన్యతే హన్యమానే శరీరే
ప్రతిపదార్ధం :-
అయమ్ =ఈ ఆత్మ
కదాచిత్ =ఎప్పుడును
న జాయతే= పుట్టుటలేదు
నమ్రియతేవా= చచ్చుటయులేదు
న భూత్వా= ఇదివఱకు లేకుండి
భూయః =మరల
భవితావాన =క్రొత్తగా కలుగువాడును కాదు
(లేక )
(భూత్వా =ఉండి
భూయః =మరల
నభవితాన= లేకుండువాడు కాదు)
అయమ్ =ఇతడు
అజః =పుట్టుక లేనివాడు
నిత్యః =మరణము లేనివాడు
శాశ్వతః =ఎల్లప్పుడునుండువాడు
పురాణః =అనాదియైనవాడు
శరీరే హన్యమానే (సతి) =శరీరము చంపబడినను
న హన్యతే =చంపబడుటలేదు
తాత్పర్యం :-
ఈ ఆత్మ ఎప్పుడును పుట్టుట లేదు.ఇదివరకు లేకుండి మరలా క్రొత్తగా కలుగువాడు కాదు.ఈతడు జననమరణాలు లేనివాడు.శాశ్వతుడు.పురాతనుడు.శరీరము చంపబడినను ఈతడు చంపబడుట లేదు.
అనువాద పద్యం :-
కం.-20.
జననము లేనిది,పూర్వము
కొనలిడ లేనిదియు కాదు, క్రొత్తగ మరలా
జనియించని దాత్మ పురా
తనమై చిరమై నిలుచును తనువు తరలినన్.
కొనలిడుట వర్ధిల్లుట
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
శ్లోకం - 21
వేదావినాశినం నిత్యం
య ఏనమజమవ్యయమ్
కథం స పురుషః పార్థ
కం ఘాతయతి హన్తి కమ్
ప్రతిపదార్థం :-
పార్థ= ఓ అర్జునా
యః =ఎవడు
ఏనమ్ =ఈ ఆత్మ ను
అజమ్= పుట్టుక లేనివానిగను
అవ్యయమ్= క్షయము లేనివానిగను
అవినాశినమ్= నాశరహితునిగను
నిత్యమ్= నిత్యునిగను
వేద= తెలిసికొనుచున్నాడో
సః పురుషః =ఆ మనుజుడు
కథం =ఎట్లు
కమ్ =ఎవనిని
ఘాతయతి =చంపించును?
కమ్ =ఎవనిని
హన్తి =చంపును?
తాత్పర్యం :-
ఓ అర్జునా!ఈ ఆత్మను ఎవడు జనన మరణాలు లేనివానిగను,నాశరహితునిగను,నిత్యునిగను ఎఱుంగునో, అట్టివాడు ఎట్లు ఒకనిని చంపించగలడు? తాను చంపగలడు?
అనువాద పద్యం :-
కం.21
లేనిది పుట్టువు మరణము
కానిది గద!నాశ మాత్మ,కలుగును నిత్యం
బీ నిజ మెరిగిన మనుజుడు
తానెటు చంపించు?చంపు?తలపుము పార్థా!
*తలపుము..తలపోయుము, ఆలోచన చేయుము.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Comments
Post a Comment